"కృతయుగే గజారణ్యే, త్రేతాయాం మాధవీపురీ ద్వాపరే స్వర్గసోపానం, కలౌ మారికాపురీ" అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. మార్కాపురం చెన్నకేశవస్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన 'గజారణ్య సంహిత' ద్వారా మనకు తెలుస్తోంది.
కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మారికాపురం' అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే 'మార్కాపురంగా' మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న 'చెన్నరాయుడుపల్లె'కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.[2]
చరిత్ర
ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఇక్కడ బసచేశాడు. ఇక్కడ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం దగ్గర విజయసూచిక నిర్మించాడు.
భౌగోళికం
జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వాయవ్యంగా 95 కి.మీ దూరంలో మార్కాపురం ఉంది. పట్టణ విస్తీర్ణం: 22.85 చ.కి.మీ
ప్రతిపాదిత అనంతపురం - అమరావతి ఎక్స్ ప్రెస్ వే పై ఉంది. ఒంగోలుకు వాయవ్యంగా 95 కి.మీ దూరంలో, నంద్యాలకు (నల్లమల కొండలకు ఆవలివైపు) 120 కి.మీ దూరంలో ఉంది.[4] సమీప రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ల దూరంలో గల మార్కాపూర్ రోడ్
వ్యవసాయం , సాగునీటి సౌకర్యం
సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది.
మార్కాపురం మీదుగా గుండ్లకమ్మ నది వెళ్ళడం జరుగుతుంది
చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.
ఆలయ చరిత్ర, వాస్తుశిల్పం
శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది. లక్ష్మీచెన్నకేశవస్వామివారికి ఎడమచేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకొచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని 'విజయసూచిక'గా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టు నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగువపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్తుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన తొమ్మిది అంతస్తులను పూర్తిచేసుకుంది.
శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి.