2011 జనాభా లెక్కల ప్రకారం, పామూరు పట్టణంలో మొత్తం 4,783 కుటుంబాలు నివసిస్తున్నాయి. పామూరు మొత్తం జనాభా 20,000 అందులో 10,340 మంది పురుషులు, 9,660 మంది స్త్రీలు ఉన్నారు.సగటు లింగ నిష్పత్తి 934. పామూరు పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2348, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 1252 మంది, ఆడ పిల్లలు 1096 మంది ఉన్నారు.బాలల లింగ నిష్పత్తి 875, ఇది సగటు లింగ నిష్పత్తి (934) కంటే తక్కువ. పామూరు అక్షరాస్యత రేటు 75.3%. ఆ విధంగా ప్రకాశం జిల్లాలో 63.1% అక్షరాస్యతతో పోలిస్తే పామూరులో ఎక్కువ అక్షరాస్యత ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 84.01%, స్త్రీల అక్షరాస్యత రేటు 66.08%.[3]
గ్రామ చరిత్ర
పామూరు పూర్వనామం సర్పపురి.
గ్రామ భౌగోళికం
పామూరు పట్టణం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ. దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.
పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది. పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo) నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
విద్యా సౌకర్యాలు
పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ, డిగ్రీ కళాశాలలు, డి.ఎడ్,, బి.ఎడ్ కళాశాలలు ఉన్నాయి.
మౌలిక వసతులు
పామూరులో ప్రజల సౌకర్యార్థం, ఆర్థిక లావాదేవీలు నెరుపుటకు వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి.
అవి: 1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2.ఆంధ్రా బ్యాంక్, 3.సిండికేట్ బ్యాంక్, 4.ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, 5.పి.డి.సి.సి.బ్యాంక్
వినోదం
వినోదం నిమిత్తం రెండు సినిమా ధియేటర్లు ఉన్నాయి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం
ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు సర్పయాగం చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా పాము కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి విషము విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
శ్రీ రామాలయం
ఈ ఆలయం పామూరు పట్టణంలోని ఆంకాళమ్మ వీధిలో ఉంది.
గ్రామ విశేషాలు
అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు, భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తల పురాణాల ద్వారా తెలుస్తుంది.