మానవతా వాది అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు. కారుగానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు ఢిల్లీ లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్పటికీ కూలర్ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్ కానీ వాడలేదు. పార్టీ క్యాంటీన్లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు. "నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు. పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానాలను విమర్శించినా చాలా ఓపికతో వినేవాడు. మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు. హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయంగా వెళ్ళేవాడు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు. రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతూ 1994 ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావును అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనేవారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు నంద్యాల రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్టమొదటి సారి మహాకవి అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.[5]