వేపూరు హనుమద్దాసు (19వ శతాబ్దం) భక్తకవి.[1] ఆయన గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి. ఆయన బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు. మొత్తానికి రామాయణం ఎంత సనాతనమో అంత నిత్య నూతనంగా ఉంటుంది.[2]
ఆసఫ్జాహీల కాలంలో (1724-1948) మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు.[3] హనుమద్దాసు మహబూబ్ నగర్ జిల్లా జిల్లా - కల్వకుర్తి తాలూకా వేపూరు గ్రామనివాసి. ‘ముతరాసి’ కులం, తల్లిదండ్రులు బారమ్మ - అచ్చయ్య... సంజన్న...వెంకట నారాయణలు అన్నతమ్ములు.[4] వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు. హనుమద్దాసు తాత తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే! ‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన గానం ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత ప్రాచుర్యం పొందాడాయన.
హనుమద్దాసుని గురించిన అనేక కథలూ - గాథలూ ప్రచారంలో ఉన్నాయ్! ఒకసారి ఊళ్లలో విషజ్వరం ఏదో ప్రబలింది. ఊళ్ళు ఊళ్ళు జ్వరం వాతపడి జన హడలిపోతున్నారు. హనుమద్దాసు యోగ సమాధిలో కూర్చుని ధ్యానం చేసి. ఒక కాషాయ జెండా తీసికెళ్ళి...ఊరి పొలిమేరలో పాతి విషజ్వరాన్ని ఈ జెండా దాటి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించారట! అంతే!! ఆ నాటినుంచీ జ్వరం వొస్తే ఒట్టు![5]
మరో సంఘటన.. భక్తులంతా ఆలయంలో గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో హనుమద్దాసు గారు రామనామ సంకీర్తన జరుగుతోంది! హనుమద్దాసు గారు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. భజన జరుగుతోంది.
మెల్లిమెల్లిగా హనుమద్దాసు పద్మాసనం వేసుకుని ఉండగానే శరీరం మెల్లిగా గాల్లోకి లేవడం ప్రారంభించింది. భక్తులు సంభ్రమాశ్చర్యాల్తో చూస్తున్నారు. హారతి ఇచ్చి గంట వాయించారు మెల్లిమెల్లిగా గాల్లోకెళ్ళిన హనుమద్దాసు గారి శరీరం కిందికి దిగింది.. భక్తులంతా పాదాలమీద పడ్డంతో హన్ ఉమద్దాసు లేచి మందహాసం చేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు! హనుమద్దాసు రచనలో ఆధ్యాత్మికత - మార్మికత ఉంటాయ్! ఉదాహరణకి..షట్చక్రోపేతమైన దేహము... దానితత్త్వాన్ని ఇలా అంటారు.
అమ్మమ్మ... ఇది యేయే... ఆరు మేడలు పైన చూడరమ్మా - ముద్దు
గుమ్మా రీతిని లోపలి గుంటొకటున్నదీ...చూడరమ్మా
గుండుకు ఒక చోటా - గుండ్లలో లోపల చూడరమ్మా
గుండ్ల మధ్యన నక్క కూతా వేయిచుండూ చూడరమ్మా - అట్టి
కూతల నడుమాననూతొకటున్నది - చూడరమ్మా
నూతిమధ్యను నక్కి నాతి కూర్చున్నదీ చూడరమ్మా - ఆ
నాతిమీదను నొక్కకోతి చేరున్నది చూడరమ్మా
కోతి మీదను పరంజ్యోతి మేలైనదీ చూడరమ్మా - ఆ
కోతియే ముల్లోక మాతాగనైనదీ చూడరమ్మ...
అంటే ఆరు మేడలంటే - షట్చక్రాలనీ దానిపై గుండంటే శిరస్సనీ అందులో రెండుకండ్లూ - అందులోని నల్లగుడ్లూ అక్కడ భ్రూ మధ్యము...ఆ బ్ర్హూమధ్యలో పరంజ్యోతి ... ఇలా మార్మికంగా ధ్యాన విధానాన్ని భోదించారు... మరో తత్త్వంతో...
బూటకుండు - శివపూజ చేసిన బుద్ధిమంతుడగునా
కాడిగట్టి ఘనకళ్ళెము చేసినా గాడ్డె గుర్రమగునా
మనసు నిల్వకను భజన చేసినా మనిషి భక్తుడగునా
కనక పర్వతము నెక్కికూసినా కాకి కోకిలగునా
అలాగే హనుమద్దాసు...ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ రైలు నెక్కి అయోధ్య వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించి.. రామేశ్వరం వచ్చి సముద్ర స్నానం చేసినట్లు తెలుస్తోంది..! ఆ యాత్రా విశేషాల్నే ‘పొగబండి’ అనే పేర తత్త్వాలు రాశారట. అవి అలభ్యం. వేపూరు హనుమద్దాసు లాంటి గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు