గన్నమ్మ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తండ్రి నాగయ. తాత గణపతి దేవుని కడ, రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.
గన్నయ ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి, పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చాడు.
1323వ సంవత్సరములో ముస్లిముల ధాటికి ఓరుగల్లు తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు, పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ చేరిన పిదప గన్నయ మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చింది. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట ఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నయ మతం మార్చబడి మాలిక్ మక్బూల్ గా పేరుబడ్డాడు. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపాడు.
ఉలుఘ్ ఖాను (మహమ్మద్ బిన్ తుగ్లక్) ఓరుగల్లును 1323లో దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట ముసునూరి నాయకుల విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో మధుర సుల్తాను జలాలుద్దీను కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు తెలంగాణమును మక్బూల్ ను అధిపతిగా చేసి ఢిల్లీ తిరిగి వెళ్ళాడు. 1336లో [సైన్యాధికారి]] మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
అటు పిమ్మట మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారు చేరి గుజరాత్, సింధు దేశములలో పెక్కు విజయములు సాధించాడు. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారులో వజీరు (ప్రధాన మంత్రి) గా నియమించబడ్డాడు. భాషాప్రాంతమతభేధములను అధిగమించి ఢిల్లీ దర్బారులో క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. విషమపరిస్థితులలో ఢిల్లీని పలువురి కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత విశ్వాసపాత్రుడయ్యాడు. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగిడాడు. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి ఐన్ ఇ మహ్రుతో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించాడు. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలున్నారు.
మరణం
మక్బూల్ 1372లో చనిపోయాడు. ఈతని సమాధి భారతదేశములోని మొదటి అష్టకోణపు కట్టడము. ఇది ఢిల్లీలో హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా సమీపములో ఉంది.[1].ఆక్రమణలవల్ల, నిర్లక్ష్యమువల్లను సమాధి శిథిలావస్థలో ఉన్నది[2].
మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు, దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ', 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.
వారసుడు
1369 లో మక్బూల్ మరణం తరువాత, అతని కుమారుడు జౌనా ఖాన్ లేదా జౌనా షా వజీరు అయ్యాడు. ఇతడు తండ్రి వలె సమర్ధుడే కాని మంచి సైనిక నాయకుడు కాడు. ఫిరోజ్ షా సమయములోనే మొదలైన వజీరు పదవి కోసం పోరు జౌనా షాని బలి తీసుకున్నది. జౌనా ఖాన్ బంధించి మరణశిక్ష అమలు చేశారు. అతను బాగా పేరొందిన ఖిడికీ మసీదు మొదలగు ఏడు పెద్ద మసీదులు కట్టించాడు[3].