నమస్తే తెలంగాణ[1] జూన్ 6, 2011 నాడు[2] తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి తోడ్పాటుగా ప్రారంభించబడిన తెలుగు పత్రిక. తెలంగాణ ప్రాంతంలోని గతకాలపు 7 జిల్లాల నుండి ఇది ప్రచురించబడుతోంది. అల్లం నారాయణ తొలి సంపాదకులు. ప్రస్తుత సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి.
ప్రతి ఆదివారం పత్రికకు అనుబంధంగా 32 పేజీల బతుకమ్మ చిరుపుస్తకం అందించబడుతుంది. ఇందులో రెండవ పేజీలో సిర్ఫ్ హమారా శీర్షికతో తెలంగాణాలోని ప్రత్యేకతలు ఇవ్వబడుతుంది. మూడవ పేజీలో "మన ట్యాంక్బండ్" శీర్షికలో తెలంగాణా ప్రముఖులపై చిరు పరిచయం తెలియజేయబడుతుంది. ఐదవ పేజీలో సంపాదకులు అల్లం నారాయణ పాఠకుల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. రాజాధిరాజ శీర్షికన కార్టూనులు, జోక్సు ప్రచురించబడతాయి. మధ్యపేజీలలో బొడ్డెమ్మ శీర్షికన చిన్నారులకు ఉద్దేశించిన విషయాలు ఉంటాయి. మైదాకు శీర్షికన మహిళలకు ప్రత్యేక పేజీ ఉంది. కవర్ పేజీ కథనం, రాశి-వాసి, సాహిత్య పరామర్శ, మన కథ, సెక్సాలజీ తదితర శీర్షికలు అదనం.
అంతర్జాలంలో నమస్తే తెలంగాణ
అంతర్జాలంలో యూనికోడ్ అక్షర రూపంలోనూ, ఈ-పేపర్ రూపంలోనూ ఈ పత్రిక www.ntnews.com అనే యూఆర్ఎల్లో అందుబాటులో ఉంది. పాత సంచికలు కూడా అందుబాటులో ఉంచబడుతుంది. అంతర్జాలం ద్వారా ఈ పత్రికను భారతదేశం, యునైటెడ్ కింగ్డం, అమెరికాలలో అధికంగా వీక్షిస్తున్నారు. డిసెంబరు 29, 2019 నాటికి ఈ పత్రిక అలెక్సా ప్రపంచ ర్యాంకు మూడు నెలల సగటు 4395 ఉండగా, భారత ర్యాంకు 394 గా ఉంది.[3]
యాజమాన్యం
కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా వున్న 2011 సంవత్సరంలో తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పత్రికను ప్రారంభించాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత పత్రిక యాజమాన్య మండలి నుండి వైదొలిగాడు. 2017-2018 కాలానికి తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల ఆదాయం గత సంవత్సరపు ఆదాయంతో పోల్చితే 387.4% పెరిగింది.[4]